Thursday 16 August 2018

Know the Small changes in AP Govt. logo



Know the Small changes in AP Govt. logo



కుంభం కాదు.. ఘటం!::
✓రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు
✓ఏళ్లతరబడి అదే పొరబాటు
✓ఇన్నాళ్లకు సర్కారు దిద్దుబాటు
✓అమరావతి స్థూపమే ఆధారంగా చిహ్నం

అమరావతి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికార చిహ్నం ఏది అనిప్రశ్నించగానే.... ‘పూర్ణ కుంభం’ అని టక్కున సమాధానం చెప్పేస్తాం! నిజానికి ఇది తప్పు! ప్రజలే కాదు... ప్రభుత్వమూ, ప్రభుత్వంలోని అధికారులూ చేస్తున్న తప్పు! ఎవరికీ తెలియకుండానే ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న తప్పు! ఈ తప్పును రాష్ట్ర ప్రభుత్వం సవరించుకుంది. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవించినప్పుడు ఉన్న అసలు సిసలైన అధికార చిహ్నాన్ని తిరిగి తెరపైకి తెచ్చింది. బుధవారం పంద్రాగస్టు సందర్భంగా ఇచ్చిన పురస్కారాలపై ఈ అధికారిక చిహ్నమే కనిపించింది.

అసలు విషయంలోకి వెళితే... ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలిసారిగా అధికారిక చిహ్నాన్ని రూపొందించారు. 1953లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఇచ్చారు. 2500 సంవత్సరాల నాటి ‘అమరావతి’ బౌద్ధస్థూపంలోని ధర్మచక్రం, పూర్ణఘటంతో ఈ చిహ్నాన్ని సృష్టించారు. దీంతోపాటు సత్యమేవ జయతే, నాలుగు సింహాలు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... వంటి గుర్తులు, వాక్యాలతో ఇది తయారైంది. ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం తర్వాత కూడా ఇదే కొనసాగింది. అయితే... ఈ అధికారిక చిహ్నం అధికారికమైన ప్రమేయంలేకుండానే రకరకాలుగా మార్పులకు గురైంది. మరీ ముఖ్యంగా... పూర్ణ ఘటాన్ని ‘పూర్ణ కుంభం’గా పొరబడటమే దీనికి ప్రధాన కారణం. దీనికి అనుగుణంగా మామిడి ఆకులను చేర్చారు.

ఘటానికి చుట్టూ ఉన్న తామరపూలు, మొగ్గలను తీసేసి... ఒక పూర్తిస్థాయి పూర్ణకుంభాన్ని చిహ్నంలో పెట్టేశారు. ప్రముఖులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికేందుకు పూర్ణకుంభం ఉపయోగిస్తారు. పూర్ణఘటం అలాంటిది కాదు. దీనిని అక్షయ పాత్రలాగా భావిస్తారు. ధర్మచక్రం మధ్యలో ఉన్న ఈ పూర్ణఘటాన్ని విదికుడు అనే చర్మకారుడు చెక్కినట్లు చరిత్ర చెబుతోంది. రాష్ట్ర అధికార చిహ్నంలో జరిగిన మార్పుల గురించి కొందరు ప్రముఖులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జీఏడీ ముఖ్య కార్యదర్శి శ్రీకాంత్‌ లోతుగా పరిశీలించారు. ఈమని శివనాగిరెడ్డి, ఇతర చారిత్రక నిపుణులతో చర్చించారు. అసలు ఈ చిహ్నానికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఎప్పుడు వెలువడింది, అందులో ఏముంది? అనే అంశంపై దృష్టి సారించారు.

ఈ నోటిఫికేషన్‌ ప్రతి హైదరాబాద్‌లోని పురాతత్త్వ విభాగంలో ఇది దొరికింది. దీనిని పరిశీలించగా... అమరావతి స్థూపం నుంచే అధికారిక చిహ్నం తీసుకున్నారని స్పష్టమైంది. అంతటితో ఆగకుండా... నిజమైన అమరావతి స్థూపంలో పూర్ణఘటం రూపాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. లండన్‌ మ్యూజియం నుంచి దీనికి సంబంధించిన ఫొటోను తెప్పించారు. పురావస్తు, చారిత్రక నిపుణులతో చర్చించి... 1954నాటి నోటిఫికేషన్‌ ప్రకారం, అమరావతి సంస్కృతి నుంచి స్వీకరించిన పూర్ణఘటాన్ని తిరిగి అధికారిక చిహ్నంలో చేర్చాలని నిర్ణయించారు.

దీని ప్రకారం... ధర్మచక్రంలో 64 గీతలు, పూర్ణ ఘటం చిత్రాన్ని చేర్చారు. నాలుగు సింహాల బొమ్మను అలాగే ఉంచారు. అదే సమయంలో గతంలో అధికార చిహ్నం పైభాగాన ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ అని ఆంగ్లంలో ఉండేది. ఇప్పుడు దాన్ని తెలుగులోకి మార్చారు. ఆంగ్లంలో కిందివైపు ముద్రించారు. సత్యమేవ జయతే అన్న సూక్తిని కూడా తెలుగులోకి మార్చి ముద్రించారు.

0 comments:

Post a Comment

Recent Posts