క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారికి రూ.2వేలు చొప్పున ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం
అమరావతి : కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారికి రూ.2వేలు చొప్పున ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. క్వారంటైన్ తర్వాత ఇంటికి వెళ్లాక పౌష్టికాహారం కోసం ఈ ఆర్థికసాయం అందజేయాలని నిర్ణయం తీసుకుంది.
క్వారంటైన్ సమయంలో ఒక్కో వ్యక్తిపై రోజుకు రూ.600 వరకు ఖర్చు అవుతోంది. క్వారంటైన్ వ్యక్తుల రవాణాకు రూ.600 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ఇలాంటి తరుణంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కరోనా విస్తరిస్తుండటంతో ఇవాళ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని, సీఎస్, డీజీపీ, వైద్యారోగ్య శాఖ ముఖ్య అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలోని 11 జిల్లాలను కేంద్రం హాట్ స్పాట్లుగా ప్రకటించడంతో పాటు ఆయా జిల్లాల్లో తీసుకోవాల్సిన చర్యలు, లాక్ డౌన్ అమలుపై నిశితంగా చర్చించారు. ఈ సమీక్షలో భాగంగానే క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారికి రూ.2వేలు చొప్పున ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.
కేసుల లెక్కలు ఇవీ..
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 534. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో కృష్ణాలో-03, కర్నూల్లో-03, పశ్చిమ గోదావరిలో-03 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 9 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 534. ఇప్పటి వరకూ 20 మంది డిశ్చార్జ్ కాగా.. 14 మంది మరణించారు. ప్రస్తుతం 500 మంది చికిత్స పొందుతున్నారు.
0 comments:
Post a Comment