తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణపై మార్గదర్శకాలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణపై విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. డిజిటల్ తరగతులకు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని పాఠశాల విద్య సంచాలకురాలు శ్రీదేవసేన కోరారు. సెప్టెంబర్ 1నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో తాజాగా మార్గదర్శకాలను విడుదల చేశారు. జూన్ 1 నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు పాఠశాలలు గంటల తరబడి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నందున విద్యార్థులకు కంటి సమస్యలతో పాటు ఆరోగ్య సంబంధ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయనే అంశాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి.
వీటన్నంటినీ దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు అనుసరించాల్సిన విధివిధానాలను విద్యాశాఖ ప్రకటించింది. గతంలోనే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను యథాతథంగా పాటించాలని కోరుతూ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా మార్గదర్శకాల ప్రకారం నర్సరీ నుంచి యూకేజీ వరకు రోజుకు 45 నిమిషాలు మాత్రమే ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. వారంలో మూడు రోజులు మాత్రమే వారికి తరగతులు ఉండాలని నిర్దేశించారు. 1 నుంచి 12 తరగతుల వరకు వారానికి 5 రోజులు డిజిటల్ తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. 1 నుంచి 5 వరకు రోజుకు గరిష్ఠంగా గంటన్నర, 6 నుంచి 8 తరగతులకు రోజుకు గరిష్ఠంగా 2 గంటలు, 9 నుంచి 12వ తరగతి వరకు రోజుకు గరిష్ఠంగా 3 గంటలు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీశాట్, దూరదర్శన్ ద్వారా తరగతులు నిర్వహించాలని.. ప్రతి గ్రామంలో తరగతులు జరిగేలా డీఈవోలు, ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
0 comments:
Post a Comment