Thursday, 24 June 2021

12వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలపై రాష్ట్రాల బోర్డులకు సుప్రీంకోర్టు ఆదేశాలు

రాష్ట్రాల బోర్డులకు సుప్రీంకోర్టు ఆదేశాలు


దిల్లీ: దేశవ్యాప్తంగా 12వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల బోర్డులు ఇంటర్నల్‌ మార్కుల అసెస్‌మెంట్‌ను పూర్తి చేసి, జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. పది రోజుల్లోగా బోర్డులను మూల్యాంకన విధానాన్ని రూపొందించి కోర్టుకు తెలియజేయాలని సూచించింది.


12వ తరగతి పరీక్షలకు సంబంధించిన దాఖలైన పలు పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. అయితే, బోర్డులన్నింటికీ ఏకరూప మూల్యాంకన విధానం ఉండేలా ఆదేశాల ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.



''ప్రతి బోర్డు స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. అందువల్ల బోర్టులు తమ సొంత మూల్యాంకన విధానాలను రూపొందించుకునే హక్కు ఉంటుంది'' అని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినందున అంతర్గత మార్కుల ఆధారంగా మూల్యాంకనం చేపట్టి వచ్చే నెల 31లోగా ఫలితాలను వెల్లడించాలని కోర్టు స్పష్టం చేసింది.


అంతకుముందు సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ బోర్డులకు కూడా సుప్రీంకోర్టు ఇదే తరహా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా బోర్డులు కోర్టుకు తమ మూల్యాంక విధానాన్ని తెలియజేశాయి. జులై 31లోగా 12వ తరగతి ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించాయి.


కరోనా మహమ్మారి ఉద్ధృతి దృష్ట్యా ఇప్పటి వరకు 21 రాష్ట్రాలు 12వ తరగతి పరీక్షలను రద్దు చేయగా.. ఆరు రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చే నెలలో పరీక్షలను నిర్వహించేందుకు మొగ్గు చూపుతుండగా దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.

0 comments:

Post a Comment

Recent Posts